కామారెడ్డి జిల్లా బీబీపేట్
బీడీ కార్మికులందరికీ పెరిగిన కరువు భత్యం (వీడీఏ) అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టి.యు) ఆధ్వర్యంలో బీడీ కంపెనీ యజమానుల సంఘం అధ్యక్షుడు హెచ్.పీ ప్రకాష్ ఉపాధ్యాయ నోటీసు అందివ్వడం జరిగింది.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టీ.యు) రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గల బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న అన్ని కేటగిరీల కార్మికులకు కరువు భత్యం (వీడీఏ) పెరిగిందన్నారు. వినిమయ ధరల సూచి 1696 నుండి1809 పాయింట్లకి పెరిగిందని తెలిపారు. అంటే 113 పాయింట్లు పెరిగాయని,1994 అగ్రిమెంట్ ప్రకారం పాయింటుకు 10 పైసల చొప్పున, 11 రూపాయల 30 పైసలు పెరిగిందని తెలిపారు. ఈ పెరుగుదల 2024 ఏప్రిల్ 01 నుండి అమలులోకి వస్తుందని తెలిపారు. బీడీలు చుట్టే కార్మికులకు 1000 బీడీలకు కరువు భత్యం(విడిఏ) 11.30 పైసలు గాను పెరిగి 245 రూపాయల 08 పైసలు అవుతుందన్నారు. అదికూడా 2024 ఏప్రిల్ 01 నుండి అమలు చేయాలని తెలిపారు. నెలసరి జీతాల ఉద్యోగులైన బీడీ సార్టర్, ఆకు, తంబాకు పంచేవారు, గుమస్తాలకు, అకౌంటెంట్లకు, బట్టీవాల, చెన్నీవాల, గంపవాల, వాచ్ మెన్ లకు నెలకు 339 రూపాయల చొప్పున పెంచి 2024 ఏప్రిల్ ఒకటో తేదీ నుండి అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీడీ ప్యాకర్లకు ఒక్కరోజు పనికి 11 రూపాయల 30 పైసలు చొప్పున వివిధ రకాల నమూన బీడీ ప్యాకింగ్ కలిగిన లక్ష బీడీ ప్యాకింగుకు కరువు భత్యం ఎంత అనేది నిర్ణయించబడుతుందని తెలియజేశారు. పెరిగిన కరువు భత్యం రాష్ట్రంలోని 07 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని అన్నారు. కాబట్టి పెరిగిన కరువు భత్యం అమలు చేయించుటకు పోరాడాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (IFTU) రాష్ట్ర కమిటీ బీడీ కార్మికులందరికీ పిలుపునిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.నరేందర్, జిల్లా అధ్యక్షులు డి.రాజేశ్వర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకన్న, జిల్లా నాయకులు బి.లింగం పాల్గొన్నారు.
బీడీ కార్మికులకు పెరిగిన కరువు భత్యం (వీడీఏ) అమలు చేయాలి
RELATED ARTICLES